ఫిబ్రవరి 24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు
ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జనవరి 18, 19 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశం ఉంటుందని వెల్లడించారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సదస్సులో ప్లీనరీ సెషన్, ఎపి స్టేట్ సెషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెషన్, కంపెనీల సిఇఒలతో ముఖ్యమంత్రి సమావేశం, ఎంఒయులు కుదుర్చుకునే కార్యక్రమాలు ఉంటాయన్నారు. భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందుగా జనవరి 10 నుంచి 15 మధ్య ఢిల్లీలో కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందులో 20 నుంచి 30 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పాల్గొనే అవకాశముందని వివరించారు. ఐటి, ఎలక్ట్రానిక్ రంగాలలో పాటు హార్డ్వేర్ రంగాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే భాగస్వామ్య సదస్సును మరింత విజయవంతం చేయాలన్నారు. ఈ ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.10.54 లక్షల కోట్ల విలువైన 664 ఒప్పందాలు చేసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.













