ఈ ఘటన ఏపీకే అవమానం : చంద్రబాబు
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న బాధితురాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికంసాయం ప్రకటించారు. సీఎం జగన్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కనీసం బాధితురాలని పరామర్శించలేదని విమర్శించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రజల ఆస్తులకు, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చర్యలతో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధితురాలికి రూ.కోటి ఆర్థికసాయం, చేసి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. అత్యాచార బాధితురాలికి న్యాం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిప్తోందని అన్నారు.













