Chandrababu : అదే జరిగితే 75 మంది మహిళలు అసెంబ్లీకి : చంద్రబాబు
తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేశామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ (NTR) కల్పించారని గుర్తు చేశారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ. 5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేశాం. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డీలిమిటేషన్ (Delimitation) పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారు అని అన్నారు.
పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు ఇచ్చాం. మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. భూమి అంటే సెంటిమెంట్ ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవే అని తెలిపారు.













