ప్రజాస్వామ్యవాదుల పోరాటానికే….టీడీపీ మద్దతు

ప్రజాస్వామ్యవాదుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం-భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎంపీ రఘురామకృష్ణపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం చేసినా నిలదీసేందుకు తమ పార్టీ ముందుంటుందన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు మీరి ప్రవర్తించడం సరికాదని, చట్టానికి లోబడే పనిచేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షారుహలే అవుతరాని అన్నారు. రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదన్నారు. తమ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల్ని తీసుకున్నారంటూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.
చట్ట ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు. తామెప్పుడూ కుల ప్రస్తావనతో ఎదురుదాడి చేయలేదని అన్నారు. కోర్టు సెలవులు చూసి మరీ జేసీబీలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని, హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. ప్రత్యర్థులపైనా దేశద్రోహం కేసు పెడతారని తనకు తెలియదని అన్నారు. మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. వాస్తవాలు రాయకుండా మీడియా నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.