విజయదశమి రోజున అసెంబ్లీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి విజయదశమి రోజున ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్డీయే సమీక్షా సమావేశంలో నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు అసెంబ్లీ, హైకోర్టుతోపాటు సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపిస్తారని చెప్పారు. గతంలో కోహినూర్ వజ్రాకృతిలో అసెంబ్లీ కోసం డిజైన్ రూపొందించారని, అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు మరో 2, 3 డిజైన్లను తెస్తున్నారని వివరించారు. అసెంబ్లీ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, వాటిని ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఖరారు చేస్తామని చెప్పారు.













