శాంతిభద్రతల విషయంలో ఏపీని… దేశంలోనే అగ్రస్థానంలో : చంద్రబాబు
శాంతిభద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. లా అండ్ ఆర్డర్పై మరింత లోతుగా చర్చించాలని, మరో సెషన్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఎన్డీయే సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామన్నారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు.
సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టనని హెచ్చరించారు. మహిళలపై ఎన్డీయే సభ్యులు అసభ్య పోస్టులు పెట్టినా ఉపేక్షించనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించారని అన్నారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు. బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడూ కేసులు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాపై 17 కేసులు, పవన్కల్యాణ్పై 7 కేసులు నమోదు చేశారు. ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై దాదాపు 60కి పైగా కేసులు పెట్టారు. ప్రస్తుత హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజును లాకప్లో చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారు అని అన్నారు. రాజకీయ పోరాటం చేసిన అందరిపైనా కేసులు పెట్టారన్నారు. ఎప్పటికీ బయటకు రానీయకూడదనుకున్నారని, కానీ ప్రజలు నేరుగా అసెంబ్లీ పంపించారని చెప్పారు.













