ఏ ఆధారాలతో చంద్రగిరిలో రీపోలింగ్ : చంద్రబాబు
ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని, కొందరికి సహకరించటం, మరి కొంతమందికి అన్యాయం జరిగేలా ఏకపక్షంగా వ్యవహరించటం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన ఎన్నికల కమిషనర్లు సునీల్ చంద్ర, అశోక్ లావాసాలను కలిశారు. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఏ ఆధారాలతో చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు బూత్ల్లో రీపోలింగ్కు ఆదేశించారో తెలపాలని నిలదీశారు. తాము చేసిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుపై తాము ఇంతకు ముందు చేసిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు. దీనిపై త్వరలోనే సమాచారం ఇస్తామని ఆయనకు ఎన్నికల కమిషనర్లు బదులిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా ఠాకూర్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు.













