విద్యార్థుల భవిష్యత్తు కోసం కొత్త విధానాలు
విద్యార్థుల భవిష్యత్ కోసం కొత్త విధానాలను రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వర్చువల్ క్లాస్ రూమ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక చోట ఉపాధ్యాయుడు బోధిస్తే రాష్ట్రంలోని అన్ని వర్చువల్ క్లాసుల్లో విద్యార్థులు లైవ్ ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు.
బెంగళూరు నుంచి వర్చువల్ క్లాస్రూమ్స్ను ఆపరేట్ చేశామని, త్వరలో గుంటూరు నుంచే మొత్తం సిస్టమ్ను ఆపరేట్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 5వేల వర్చువల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఓ యాప్ను రూపొందిస్తున్నామని అన్నారు. జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.













