ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా?
ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి వాటిని సహించేది లేదని సృష్టం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడిన సీనియర్ నేత దేవినేని ఉమాను అరెస్టు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాతో పాటు ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమాపై భౌతిక దాడికి దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీని ఓ ఎమ్మెల్యే బహిరంగంగా బెదిరించారన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావం కలిగిన జగన్ హయాంలో రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు.













