తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి …తాము పెంచుతామని చెప్పలేదు
అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని, ఆ మేరకు మొదటి ఏడాది రూ.11 వేలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని, అయితే ఎన్నికలకు వెళ్తున్నామని, సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. వైసీపీ హామీల అమలుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయా పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమన్నారు. స్థానిక పరిణామాలు, పరిస్థితులు, సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదనన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్పై చర్చలు జరుగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పు ఉండబోదనే నమ్మకాన్ని బొత్స వ్యక్తం చేశారు.













