ఇది పూర్తిగా ప్రజల ఇష్టానికే వదిలేశాం : బొత్స
ఓటీఎస్ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇది పూర్తిగా ప్రజల ఇష్టానికే వదిలేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ముఖ్య ఉద్దేశం అని అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్లకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని ప్రశ్నించారు. ఓటీఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటీఎస్ కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెల 28తో ముగియనుండగా, గడువును పెంచాలని అనేకమంది కోరుతున్నారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.













