స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం….
ఆంధప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద కాన్వాయ్లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో తమ్మినేనికి ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం ఆమదాలవలసకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం తమ్మినేని సీతారాం మరో వాహనంలో ఆమదాలవలసలోని స్వగృహానికి చేరుకున్నారు.













