ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధప్రదేశ్ ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ పిలుపునిచ్చారు. ఆయన రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని ఎన్నికల కమిషనర్కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సిన వచ్చిన అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. సమయానుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియామావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు.













