ఏపీ మంత్రి కాకాణికి బెదిరింపులు… 79 సార్లు ఫోన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్కు బెదిరింపులు తప్పలేదు. ఓ వ్యక్తి లోన్ తీసుకుని ప్రత్యామ్నాయ ఫోన్ నెంబర్ను మంత్రిది ఇచ్చాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు లోన్ కట్టాలంటూ ఏకంగా కాకాణికే ఫోన్ చేశారు. తమకేమీ సంబంధం లేదని మంత్రి పీఏ సమాధానమించిచనా వారు ఫోన్ చేయడం మానలేదు. లోన్ చెల్లించాల్సిందేనంటూ మంత్రికి 79 సార్లు ఫోన్ చేశారు. వీరి ఆగడాలు శృతి మించడంతో మంత్రి కాకాణి జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నైలోని యాప్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కాపు నేస్త కార్యక్రమానికి హాజరైన మంత్రి యాప్ నిర్వాహకుల వేధింపులపై స్పందించారు. ముత్తుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా నా నెంబర్కు 79 సార్లు ఫోన్ చేశారు. నాకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై ఆరా తీస్తే రుణం తీసుకున్న అశోక్ కుమార్ నా నెంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని చెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నామని చెబుతున్నారు. పోలీసులు వివరాలు సేకరించి నలుగురిని అరెస్టు చేశారు.













