నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోండి : హైకోర్టు
ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ని పూర్తిగా మార్చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు సృష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్కుమార్ ఎన్నికల కమిషనర్గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి నేతృత్వలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఎలక్షన్ కమిషనర్గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్గా కనగరాజు కొనసాగడానికి వీల్లేనది పేర్కొన్నారు. ఆర్డినెన్స్ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నట్టేనని వివరించారు.













