విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ఆంధప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ పిటిషన్లో పేర్కొన్నారు. కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికు సంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.













