ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. జీవో 53, 54ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజును ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రైవేట్ స్కూళ్లు, జూ కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ప్రతి ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీవిజయ్ వాదించారు.













