మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన
రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని, పరిశీలించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని వెల్లడించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.













