సీఎం వైఎస్ జగన్ కు.. గవర్నర్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం అభినందనీయం అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందన్నారు. నూతన జిల్లాలతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం మంచి ఆలోచన అని అన్నారు.













