డిక్లరేషన్ రచ్చ ఓవైపు..జగన్ పర్యటన రేపు…
నిరసనలకు బాబు పిలుపు
తిరుమలలో అన్యమతస్తులు సమర్పించాల్సిన డిక్లరేషన్ పై రాజుకున్న రచ్చ అంతకంతకూ తీవ్రమవుతోంది. దీనిపై భాజాపా, తేదేపా లు ఒక్కటిగా గొంతెత్తుతున్నాయి. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల తర్వాత మరింతగా వివాదం చెలరేగింది. ఇదే అంశం గత రెండు రోజులుగా మీడియా చర్చోపచర్చలకు ఇదే కేంద్ర బిందువుగా ఉంది. అన్యమతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని భాజాపా నేతలు పట్టుబడుతుండగా హిందూ ధార్మిక సంఘాలు సైతం ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. ఈ అంశంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మంగళవారం స్పందించారు. ఈ విషయంపై ఆయన చిత్తూరు జిల్లాయ తేదేపా నేతలతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. డిక్లరేషన్పై జగన్ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు జరపాలంటూ ఆయన వారికి పిలుపిచ్చారు.
ఇదీ జగన్ షెడ్యూల్..
మంగళవారం ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడే బసచేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు. అక్కడ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడ్యూరప్ప తో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనం భూమి పూజలో పాల్గొంటారు, ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, శ్రీ బిఎస్.యడ్యూరప్ప నాదనీరాజనం వేదికపై జరిగే సుందరకాండ పారాయణం హాజరవుతారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో, అదనపు ఈవో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్జెట్టి పరిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 23న గరుడసేవ నాడు .ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు రానున్న నేపథ్యంలో బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి శ్రీవారి ఆలయం వరకు, నాదనీరాజనం వేదిక వద్ద భద్రత ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. .నాదనీరాజనం వేదికపై భద్రత, అలంకరణ, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం గోకులం విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఈ అంశంపై అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.













