ఆ రోజు చిన్న అలజడి సృష్టించినా.. వెంటనే అరెస్టు చేస్తాం
ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ( సీఈవో) ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయిమ్ అస్మితో కలిసి ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.













