పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతుల సాగు ఒప్పందం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవరూ ట్యాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. అలాగే ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టాలని ప్రతిపాదించింది.
చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ పార్క్ కోసం 149 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు కూడా జీతాలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500 మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్లకు రూ.7 వేలు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ఆమోదముద్ర వేసింది. పట్టణ ప్రాంతాల్లోనూ వాలంటీర్ల వ్యవస్థకూ ఆమోదం తెలిపింది. వీరికి నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. దేవాదాయశాఖ చట్టంలో మార్పుల ముసాయిదా బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.













