మూడు రాజధానులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపవర్ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. కాగా, నాలుగు కీలక బిల్లులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోనే అసెంబ్లీ కొనసాగనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏపీ సచివాలయం కార్యకలాపాలు జరగనున్నాయి. జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఏర్పాటు కానుంది. రాష్ర్టాన్ని 4 పరిపాలన జోన్లుగా విభజించాలని, మంత్రులు రెండు చోట్ల అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి, రైతులకు ఇవ్వాలని ఏపీ మంత్రి వర్గం నిర్ణయించింది. రైతులకు ఇచ్చే కౌలును 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ, రైతు కూలీలకు నెలవారీగా ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 2,500 నుంచి రూ. 5000లకు పెంచుతున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. సీఆర్డీఏని.. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.













