Amaravati: డిసెంబర్ నాటికి అమరావతిలోనే .. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు : అయ్యన్నపాత్రుడు
ఈ డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని అమరావతి (Amaravati) క్వార్టర్స్లోనే ఉంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలోని ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ (Swimming pool) , ఆస్పత్రి, క్లబ్ హౌస్ (Club House) ఉండేలా చూడాలని ఆదేశించారు. సోలార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వేస్ట్ వాటర్ వినియోగం ఉండాలని దిశానిర్దేశం చేశారు. చట్టసభ సభ్యుల కోసం మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35 మంది మంత్రులు (Ministers) , 36 మంది న్యాయమూర్తుల క్వార్టర్స్ వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. కృష్ణానది వెంబడి సీఎం అధికారిక నివాసం, రాజ్భవన్ ఉంటాయని తెలిపారు.













