19 నుంచి ఏపీ శాససభ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణం లోనే వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను చేపట్టనున్నారు. 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. శాసనసభ, శాసన మండలి వ్యవహారాల సలహా మండళ్ల భేటీలను 18న లేదా 19న నిర్వహించి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం 10`12 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడేళ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఉప సభాపతిగా ఎన్నుకునే ప్రక్రియను ఈ సమావేవాల్లో చేపట్టనున్నారు.













