ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు – అమెరికా ఎన్ఆర్ఐల విజయం
ఊహించని రీతిలో విజయ దుందుభి మోగించి గెలుపు సాధించిన కూటమిలో నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల పాత్ర గురించి అన్ని చానల్స్, పత్రికలు, పోర్టల్స్ చెబుతూనే ఉన్నాయి. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచటమే మన ఎజెండా’ అంటూ దాదాపు రోజుకు కోటి రూపాయలపైన వచ్చే ఆదాయం, లక్షలాది అభిమానులను తెచ్చి పెట్టె సినిమా వృత్తిని పక్కన పెట్టి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి, బయట నుంచి, పార్టీ లోపల నుంచి ఎన్ని రకాల ఒత్తిడిలు వచ్చినా తట్టుకొని, కూటమి ఫార్ములాని తయారు చేసి, మేనిఫెస్టో తయారు చేసి, 74 ఏళ్ల వయసులో 45 డిగ్రీల ఎండలో తిరిగిన చంద్రబాబు గురించి, మంగళగిరిలో ఉంటూ ఒక పక్క తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ, ఇంకో పక్క టీడీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్రమంతటా అభ్యర్థులకు కావలసిన సహాయ సహకారాలు, సలహా సూచనలు ఇచ్చిన లోకేష్ గురించి రాష్ట్రంలోని, దేశంలోని మీడియా చెప్పేసింది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటమే కాదు, కేంద్రంలో ఎన్డీయే లో కీలకపాత్ర పోషించనున్నారన్న విషయం ప్రతి తెలుగు వారికి గర్వకారణం అవుతుంది కదా!
ఇది ప్రజల విజయం అని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ కాంప్లిమెంట్ రాష్ట్ర ప్రజలందరికి వర్తిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో విదేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు క్రియాశీలక పాత్ర పోషించారని మీడియా ప్రతి రోజు చెప్తూనే వుంది. అమెరికాలో గత 1-2 సంవత్సరాలుగా పెరిగిన రాజకీయ చైతన్యం, అమెరికా నుంచి ఎన్నికల్లో అభ్యర్థిగా ముందుకొచ్చిన ఎన్ ఆర్ ఐ ల వివరాలు, గత 3-4 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు పరిశీలిస్తే ‘‘ఇది ఎన్నారైల విజయం’’ అనే చెప్పాలి.
పోటీ చేసి – గెలిచిన అభ్యర్థులు
1. పెమ్మసాని చంద్ర శేఖర్ : గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వచ్చి ప్రపంచ ఖ్యాతి పొందిన సినిమా హీరో కృష్ణ తరువాత అంతటి పేరును పెమ్మసాని చంద్రశేఖర్ సంపాదించుకున్నారు. బుర్రి పాలెంలో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి అమెరికా వచ్చి స్వశక్తితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకొంటూ మిలియనీర్ నుంచి బిలియనీర్ ఎదిగిన డా. చంద్ర పెమ్మసాని, రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచనతో టీడీపీలో చేరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేశారు. దాదాపు 865000 ఓట్లతో (60%) 3,44,695 ఓట్ల మెజారిటీ తో తిరుగులేని విజయం సాధించారు. తొలివిజయంతోనే కేబినెట్ సహాయమంత్రిగా కూడా ఆయన ప్రమోషన్ అందుకున్నారు.
2. రాము వెనిగేళ్ల : గుడివాడలో పుట్టి, అమెరికా వెళ్లి కొన్ని సంవత్సరాలు ఐటీ రంగంలో ఉద్యోగ చేసి, అట్లాంటా పట్టణంలో ఎఫిసెన్స్ అనే ఐటీ కంపెనీ ద్వారా వ్యాపార రంగ లో కి ప్రవేశించి మంచి పేరు తెచ్చుకొన్న రాము వెనిగేళ్ల కూడా తానూ పుట్టిన గుడివాడకు, ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేద్దామనే ఉదేశ్యంతో రాజకీయాల్లోకి 2023లో వచ్చారు. ఎన్నికలు రావటానికి దాదాపు 1-2 ఏళ్ళు ముందుగానే టీడీపీ నాయకత్వాన్ని కలిసి గుడివాడ నుంచి పోటీ చేశానని చెప్పారు. దాదాపు 4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా వున్న ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కి పోటీ గా రాము వెనిగేళ్ల సరిఅయిన వ్యక్తి అని శ్రీ చంద్రబాబు కూడా భావించి సరే అనడంతో రాము గుడివాడ నియోజక వర్గం లో తన పని మొదలు పెట్టారు. గుడివాడ గడ్డ – నాని అడ్డా అనే చోట నాని మీద 53,040 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు అమరావతి రాజధాని గా తయారయ్యే రాబోయే రోజులలో రాము వెనిగేళ్ల కీలక పాత్ర పోషిస్తారని, గుడివాడను అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.
3. సురేష్ కాకర్ల : అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలే పట్టణంలో ఉంటున్న సురేష్ కాకర్ల అనేక సంవత్సరాలుగా తానా సంస్థ నుంచి, కాకర్ల చారిటబుల్ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ దగ్గరయ్యారు. ఇప్పుడు జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి 9,621 పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
4. సొంగా రోషన్ కుమార్ : ఏలూరు జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ చింతలపూడి నుంచి ఎన్నారై సొంగా రోషన్ కుమార్ విజయాన్ని దక్కించుకున్నారు. వెస్ట్ వర్జీనియాకు చెందిన సొంగా రోషన్ కుమార్ ఈ ఎన్నికల్లో 27,766 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన సొంగా రోషన్ కుమార్కు చంద్రబాబు నాయుడు టిక్కెటు ఇవ్వడంతో ఆయన తన సేవలతో, ప్రచారంతో విజయాన్ని అందుకున్నారు.
1996 లోనే అట్లాంటా నుంచి గడ్డం ఆత్మ చరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నిజమా బాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినా విషయం, ఆ తర్వాత కూడా న్యూయార్క్ నివాసి మధు యాష్కీ కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ నుంచి 2004లో, 2009లో పోటీ చేసి విజయం సాధించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. 2009 ఎన్నికల సమయం నుంచి అనేక మంది ఎన్ ఆర్ ఐ లు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహపడుతూ ముందుకు రావడం, వారికి ప్రధాన పార్టీల నుంచి సీట్ లేకపోవడం జరుగుతూ వచ్చింది.
అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ: 2007లో చంద్రబాబు గారు అమెరికా వచ్చి 10 పట్టణాల టూర్ చేసినప్పుడు కాలిఫోర్నియాలోని శ్రీ జయరాం కోమటిని ఎన్ఆర్ఐ టీడీపీకి ఇంచార్జిగా నియమించడం, శ్రీ జయరాం కోమటి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేయోభిలాషులు, చంద్రబాబు అభిమానులు దగ్గరవడం జరుగుతూ వస్తోంది. 2014 లో శ్రీ చంద్ర బాబు ముఖ్యమంత్రి గా టీడీపీ అధికార పార్టీగా రావడంతో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యక్రమాలు కూడా బాగా పెరిగాయి. అదే సమయంలో ఎపిఎన్ఆర్టీ సంస్థ ఏర్పడటం, మరో ముఖ్య ఎన్ఆర్ఐ డా రవి వేమూరిఈ సంస్థకి ఇంచార్జి గా రావడం, అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ అనేక కార్యక్రమాలు చేయడం, ప్రతి పట్టణంలో సభ్యులు విస్తృతంగా పెరగడం ఆటోమేటిక్ గా జరిగాయి.
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక 2-3 ఏళ్ళు కొంచెం స్తబ్దత ఏర్పడినా మళ్లీ కొవిడ్ సంక్షోభం తరువాత 2022 నుంచి ఎంఆర్ఐ టీడీపీని ఉత్తేజ పరిచే బాధ్యతను శ్రీ జయరాం కోమటికి అప్పచెప్పడంతో ప్రతి పట్టణంలో టీడీపీ అభిమానుల వివరాలు సేకరించారు. టీడీపీ నాయకత్వం కూడా ఈసారి ఎన్నికల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులకు వారి సమర్థతను బట్టి, ఎంచుకొన్న నియోజకవర్గంని బట్టి సీట్ ఇస్తాము అని ఒక హామీ ఇవ్వడంతో చాలామంది ముందుకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా నుంచి, రాజంపేట నియోజక వర్గం నుంచి అమెరికా ప్రముఖుడు, ఎన్ ఆర్ ఐ శ్రీ సతీష్ వేమనకి కూడా పోటీ చేయాలనే కోరిక బలంగా ఉందింది. కానీ చంద్రబాబు సతీష్ వేమనకి తెలుగు దేశం కార్యనిర్వాహక కార్యదర్శి పదవితో పాటు బాధ్యతలు ఇవ్వటం, సతీష్ వేమన అనేక నియోజక వర్గాలు తిరిగి పార్టీ అభ్యర్ధులని కలిసి వారి గెలుపుకి కృషి చేశారు. నాట్స్ సంస్థ పూర్వ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ గుంటూర్ తూర్పు నియోజక వర్గం నుంచి, గొంప కృష్ణ శృంగవరపు కోట నుంచి, పైలా ప్రసాద రావు మాడుగుల నుంచి పోటీ చేయడానికి తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి పనులు, ప్రచారాలు కూడా చేసుకొన్నారు. అయితే అనేక కారణాల వలన, స్థానిక సమీకరణల వలన వారికి టికెట్ దక్క లేదు. అయితే పార్టీ నిర్ణయించుకొన్న ఎన్ఆర్ఐలు గెలిచి తమ సత్తా చాటారు. అమెరికా నుంచి దాదాపుగా 200 మంది ఎన్నారైలు ఆంధ్ర రాష్ట్రంవెళ్లి ప్రచార బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తోంది.
– చెన్నూరి వెంకట సుబ్బారావు







