గవర్నర్ను కలిసిన రాజధాని రైతులు
అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిప్రతం సమర్పించారు. తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు ప్రభుత్వం అడిగితే అందరమూ భూములు ఇచ్చామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు. అయితే గవర్నర్ ఈ విషయాలపై సానుకూలంగానే స్పందించినట్లు రైతులు తెలిపారు.
175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, జగన్ కూడా మూడు వేల ఎకరాలు కావాలని చెప్పినట్లు వారు గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రాజధానిని తరలిస్తామని ప్రకటించడం అన్యాయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, లేకుండా తమ జీవితాలు రోడ్ల పాలవుతాయని అన్నారు. మా బాధను అర్థం చేసుకొని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.













