వావ్… చైనాను చూసి మోడీ నేర్చుకోవాల్సిన పాఠమిది..!!
నరనరాన దేశభక్తి అనే ఓ సోకాల్డ్ బ్రహ్మపదార్థాన్ని మెదళ్లలో నింపుకుని ఆలోచించేవారికి ఇది యాంటీ సెంటిమెంట్ వార్త… కానీ, అక్షరాలా నిజం… ప్రగల్భాలు, అబద్ధాలు, అతిశయోక్తులతో నోట్ల రద్దును ఇంకా గుడ్డిగా సమర్థించే బీజేపీ వెంకయ్యలకు అస్సలు రుచించని వార్త… ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ మీటింగుల్లో తన పక్కనే కూర్చునే సుజనాచౌదరిని విస్మరించి, లండన్ చెక్కేసిన విజయ్ మల్యాను విస్మరించి, లక్షల కోట్ల మేరకు బ్యాంకు రుణాల్ని ఎగవేసిన పెద్దల మొహాలను కాస్త విస్మరించి, అడ్డగోలుగా వేల కోట్లలో ఎగవేత రుణాలను రద్దు చేయించుకుంటున్న పెద్దలను విస్మరించి, పన్ను బకాయిల్ని ఎగవేసే ప్రముఖులను విస్మరించి, వారికి సహకరించే నాయకుల రాక్షస మొహాలను విస్మరించి… ఇది చదవొద్దు… అవన్నీ గుర్తు చేసుకుంటూ మాత్రమే చదువుకోవాలి…
చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల్ని బ్లాక్ లిస్ట్ చేయమని ఆదేశించింది… బ్లాక్ లిస్టు ఎక్కడ..? ఎందులో..? ఎలా..? విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా… కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా… చివరకు క్రెడిట్ కార్డులు కూడా పనిచేయకుండా…! గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం… చైనా ప్రభుత్వం ఇప్పటికే 61.5 లక్షల మందిని విమానాల టికెట్లు కూడా కొనకుండా బ్లాక్ లిస్టు చేసింది… 22.2 లక్షల మంది అసలు హైస్పీడ్ ట్రెయిన్లలో ప్రయాణం కూడా చేయకుండా నిషేధించింది… పాస్పోర్టులు, ఐడీ కార్డుల ఆధారంగా దీన్ని అమలు చేస్తున్నట్టు సుప్రీమ్ పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెబుతున్నాడు… 71 వేల మంది ఎగవేతదారులు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులుగా, ఎగ్జిక్యూటివ్స్గా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేశారు… 5.5 లక్షల మంది రుణఎగవేతదారుల క్రెడిట్ కార్డుల దరఖాస్తులను ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చెత్తబుట్టలో పారేసింది…
ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ సలహా కమిటీల సబ్యులు, స్థానిక లెజిస్టేటివ్ సభ్యులు, చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ డెలిగేట్స్ విషయంలోనూ ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దని సుప్రీం ఆదేశించింది… దీంతో కొందరిని బహిష్కరించారు, కొందరిని డిమోట్ చేశారు… కనీసం పది లక్షల మంది దీంతో బెదిరిపోయి, రుణాలు చెల్లించటానికి సిద్దపడుతున్నారట… అయ్యా… మోడీ సాబ్… నోెట్ల రద్దు వంటి తిరోగమన నిర్ణయాల జోలికి పోకుండా, ఇలాంటి చర్యలు తీసుకోగలవా..? ఇలా చేస్తే దాదాపు 10 లక్షల కోట్ల మేరకు రుణ ఎగవేతదారులు, అక్రమ పన్ను మినహాయింపు లబ్ధిదారుల నుంచి ఎంతో కొంత వసూలు చేయొచ్చు… ఏటీఎంల్లో నగదు ఉంచకపోవడం, బ్యాంకులకు నగదు పంపించకపోవడం… ఇది కాదు సమర్థ పాలన మోడీ సాబ్..? ఉక్కుపాదం మోపాల్సింది సామాన్యుడిపై కాదు… చేతనైతే ఇదుగో ఇలా..? 56 ఇంచుల ఛాతీ నిజంగా ఉంటే… ఇలాగే…!!













