విజయవాడ నుంచి ఇండిగో సేవలు
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలకు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది. వచ్చే నెల 2 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఇండిగో ఎయిర్లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ విలేకరులతో చెప్పారు. హైదరాబాద్కు మూడు, చెన్నై, బెంగళూరు నగరాలకు చెరో సర్వీసు చొప్పున మొత్తం ఐదు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్లో తిరుపతి, రాజమండ్రిల తర్వాత విజయవాడ నుంచి ఇండిగో తమ సర్వీసులు ప్రారంభిస్తోంది. మరో మూడు నుంచి ఆరు నెలల్లో విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ, ముంబై, జైపూర్ తదితర నగరాలకూ విమాన సర్వీసులు నడపనున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. ఇమిగ్రేషన్ వసతులు ఏర్పడిన తర్వాత విజయవాడ నుంచి ఆగ్నేయ, పశ్చిమాసియా దేశాలకు సర్వీసులు నడపటానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.













