సమాచారం ఇవ్వకుంటే ఆర్టీఐ చట్ట ఉల్లంఘనే
ఆధార్ కార్డు లేదన్న సాకుతో అర్జీదారునికి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే అది సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) ఉల్లంఘన అవుతుందని, వేధింపులకు గురిచేసినట్టు భావించాల్సి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) స్పష్టం చేసింది. సమాచారం ఇవ్వడానికి నిరాకరించినందుకు ‘హడ్కో’ (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)లోని ఆర్టీఐ వ్యవహారాలను చూసే అధికారికి సిఐసి జరిమానా విధించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హడ్కోలో అధికారులకు బహుమతులను కొనేందుకు చేసిన ఖర్చు వివరాలను తెలపాలని విశ్వాస్ భంబూర్కర్ అనే వ్యక్తి ఆర్టిఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. 2013- 16 మధ్యకాలంలో బహుమతుల కొనుగోలు, హడ్కో సిఎండి అధికార నివాసానికి మరమ్మతులు, విద్యుత్ బిల్లులు, నగదు పారితోషికాలకు ఎంత ఖర్చయిందో తెలపాలని ఆయన కోరారు. అయితే, ఈ వివరాలు తెలియజేయాలంటే అర్జీదారు ఆధార్ కార్డు, ఓటరు ఐడి, పాస్పోర్టు వంటి ఆధారాలను తెలియజేయాలని హడ్కోలోని సమాచార అధికారి డికె గుప్తా లేఖ రాశారు. దరఖాస్తు చేసిన విశ్వాస్కు హడ్కో నుంచి 30 రోజులలోగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్ర సమచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు తెలిపారు.













