బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి కోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఇతర నిందితులు బీఎల్ శర్మ, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, ధర్మదాస్లతో పాటు రామ్ విలాస్, లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల పూచికత్తుపై ఈ ఐదుగురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారని, రాముడి కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంత ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.













