మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూత
భారతరత్న, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్ 11వ తేదీన ఎయిమ్స్లో చేర్పించారని, గత 9 వారాలుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే గత 36 గంటల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని డాక్టర్లు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి (93) గురువారంనాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, మధుమేహం, ఛాతీలో అసౌకర్యం తదితర అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. వాజ్పేయి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డిసెంబర్ 25,1924 మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబీహారీ వాజ్పేయి. ఎంఏ వరకు విద్యనభ్యసించారు. 1957లో వాజ్పేయి తొలిసారి బలరాంపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. దీన్దయాళ్ మరణానంతరం జనసంఘ్ బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు. భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. అత్యున్నత పురస్కారాలైన పద్మవిభూషణ్, భారతరత్న, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు వరించాయి.













