ట్రంప్ వర్సెస్ హారిస్ .. హోరాహోరీ పోరు తథ్యమా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. బైడెన్ డెమొక్రాట్ అభ్యర్థిగా ఉన్నంతకాలం ప్రజాదరణలో ట్రంప్ హవా నడిచినా.. ఇప్పుడు కాస్త పరిణామాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకూ ట్రంప్ కు సమీపంగా ఉన్న హారిస్… ఇప్పుడు ట్రంప్ ను సైతం దాటి ప్రజాదరణ పొందుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తాజా పరిణామాలు డెమొక్రాట్లలో ఆనందాన్ని పెంచుతుంటే.. ట్రంప్ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమెరికాలోని పలు సంస్థలు దీనిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని తెలిపింది.
నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు విజయావకాశాలు మెరుగయ్యాయి. భారీ మొత్తంలో విరాళాలు సైతం వచ్చాయి. ఆమె సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాగా త్వరలో ఆమె తన రన్నింగ్ మేట్ను ప్రకటించనున్నట్లుగా సమాచారం. కమలా హారిస్కు దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్ విలేకర్లకు వెల్లడించారు.
కార్టర్ 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ ఆదివారం వాషింగ్టన్లో హారిస్ను కలిసినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. కాగా గత నెలలో హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్నకు విజయావకాశాలు పెరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.. అనంతరం ఆయన నిర్వహించిన పలు ర్యాలీల్లో మాట్లాడుతూ హారిస్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.






