ట్రంప్ విక్టరీ స్పీచ్…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో విజయదుందుభి మోగించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘విక్టరీ స్పీచ్’ ఇచ్చారు. అమెరికా బంగారు భవిష్యత్కు తనది పూచీ అని ఆయన ప్రకటించారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదన్నారు ట్రంప్. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన ఈ భారీ మెజారిటీ గెలుపు సాధించడానికి తోడ్పాటు అందించిన మద్దతుదారులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
అద్భుత రాజకీయ విజయం
‘‘గతంలో ఎప్పుడు చూడని విజయం చూశామన్నారు ట్రంప్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆల్ టైమ్ గ్రేట్ రాజకీయ ఉద్యమం అని నేను భావిస్తున్నాను. అమెరికాలో, బహుశా వెలుపల కూడా ఇలాంటి ఘట్టం జరగలేదు. అమెరికా ఇప్పుడు మరో కొత్త స్థాయికి చేరుకోబోతోంది. ఎందుకంటే మన దేశం కోలుకోవడానికి మనం సాయం చేయబోతున్నాం. మన దేశానికి ఇప్పుడు సాయం అవసరం. మన సరిహద్దులను మనం సరిదిద్దుకుందాం. మన దేశానికి సంబంధించిన ప్రతిదాన్ని చక్కదిద్దుదాం. ఈ రాత్రి చరిత్రలో నిలిచిపోతుంది. ఎవరూ ఊహించని అవరోధాలను మేము అధిగమించాం. అత్యంత అద్భుతమైన రాజకీయ విజయాన్ని సాధించాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
శ్వాస ఉన్నంత వరకు పోరాడుతా…
‘‘మీ కుటుంబం, మీ భవిష్యత్తు కోసం పోరాడుతా’’ అంటూ అమెరికన్లను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ ధృడమైన, సురక్షితమైన, సంపన్నమైన అమెరికాను అందించే వరకు విశ్రమించబోను. ప్రతి రోజు శ్రమిస్తాను. నా శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కోసం పోరాడతాను. అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతాను’’ అని అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. ఈ మేరకు ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో తన మద్దతుదారుల సమక్షంలో ఆయన ప్రసంగించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్కు డొనాల్ట్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ‘‘ నా సహచరుడు జేడీ వాన్స్కు ప్రత్యేక అభినందనలు’’ అన్నారు.






