సదస్సుపై భారీగానే ఆశలు
మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం జీఈఎస్ సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు మరో మెట్టును అధిగమించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావంతో ఉంది. ‘ది ఇండియా ఎడ్జ్‘ పేరుతో దేశంలో ప్రఖ్యాతి సాధించిన వంద స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సులో పాలుపంచుకునే అరుదైన అవకాశం కల్పించింది. ఈ స్టార్టప్లన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయని, దీంతో కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు భారత్ గమ్యస్థానంగా నిలుస్తుందనే అభిప్రాయాలున్నాయి. ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సదస్సుపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ అవకాశం భవిష్యత్తులో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు తెచ్చి పెడుతుందని, శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇక్కడున్న అపారమైన వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది.













