దియామీర్జాకు అరుదైన గౌరవం
బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దియా మీర్జా (38) అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) ప్రచారకర్తగా ఎంపికైంది. ఇందుకోసం మొత్తం అరుగురుని ఎంపిక చేయగా అందులో దియా మీర్జా ఒకరు. మిగతా ఐదుగురిలో అలీబాబా చీఫ్ జాక్ మా కూడా ఉన్నారు. నైజీరియా, చాద్ దక్షిణాఫ్రికా, ఇరాక్ల నుంచి మిగతా వారిని ఎంపిక చేశారు. వీరితో కలిసి ఈ బృందంలో ఉన్న వారి సంఖ్య 17కు చేరినట్టు ఐరాస సెక్రటరీ జనరల్ ఆటనియా గుటెరస్ తెలిపారు. వీరందరూ కలిసి ఆకలి, పేదరికాన్ని రూపుమాపడానికి, అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించడం.. తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తారని గుటెరస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దియా మీర్జా మాట్లాడుతూ ఎస్డీజీ ప్రచారకర్తగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. శాంతి, సుస్థిర అభివృద్ది కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రచారం చేస్తానని తెలిపింది.













