న్యూయార్క్ బీభత్సం… చరిత్రలో ఎన్నడూ లేనంతగా
అమెరికాలోని న్యూయార్క్ అల్లకల్లోలమైంది. భీకర వానలు, ఆకస్మిక వరదలు పోటెత్తడంతో నగరమంతా జలమయం అయ్యింది. దీంతో ఆ నగర మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదా తుఫాన్ వల్ల అమెరికాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేనంతగా న్యూయార్క్ లో వర్షం కురిసినట్లు మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. రోడ్లపై అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఆయన వెల్లడించారు. అతి క్రూరంగా కురిసిన వాన వల్ల సబ్ స్టేషన్లు, ఇండ్లు, రోడ్లు అన్నీ నీటమునిగాయి. తుపాను కారణంగా ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అండర్పాస్ వంతెనలు, రైల్వే స్టేషన్లు సబ్వేల్లోకి భారీగా నీరు చేరింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు విమానాలు రద్దయ్యాయి. మెట్రో రవాణాను నిలిపివేశారు. తుపాను దృష్ట్యా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ కేటీ హోచుల్ తెలిపారు. అటు పొరుగున ఉన్న న్యూజెర్సీలోనూ అత్యవసరస్థితిని ప్రకటించారు.













