అబ్దుల్ కలాం పేరు మీదుగా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సహకరిస్తాం
తానా ఫౌండేషన్ ట్రస్టీ శశికాంత్ వల్లేపల్లి
భారత మాజీ రాష్ట్రపతి, అణు సాంకేతికత పితామహుడు, ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకలు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానా ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్, డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, నిర్వాహకుడు ఇండియన్ నరేష్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సభలో డాక్టర్ అబ్దుల్ కలాం పేరు మీదుగా యువతరానికి ఉపయోగపడే విధంగా శిక్షణ మరియు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తగిన సహకారాన్ని అందిస్తామని మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. తాను కూడా తన వంతు సహకారాన్ని అందిస్తానని తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ ప్రకటించారు.













