చర్చల నుంచి ట్రంప్ వాకౌట్
గత 19 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్కు తెర దించేందుకు జరిగిన చర్చల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాకౌట్ చేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సరిహద్దు గోడ నిర్మాణానికి 570 కోట్ల డాలర్ల నిధులివ్వడానికి డెమొక్రాట్లు తిరస్కరించడంతో ట్రంప్ ఆర్థాంతరంగా చర్చల నుంచి వాకౌట్ చేశారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్లో డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు చుక్ షూమర్తో చర్చలు జరపడం వల్ల సమయం వృథా తప్ప ఉపయోగమేమీ లేదని వాకౌట్ చేసిన అనంతరం ట్రంప్ ట్వీట్ చేశారు. చర్చల్లో నాన్సి పెలోసిని సరిహద్దు గోడకు నిధులు ఇస్తున్నారా అని అడిగాను. అందుకు ఆమె నో అని చెప్పారు. ఆ వెంటనే తాను ఆమెకు బై చెప్పానని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ టెంపర్ తంత్రం వల్లే చర్చలు విఫలమయ్యాయని డెమొక్రటిక్ పార్టీ నాయకులు విమర్శించారు. ట్రంప్ వ్యవహార తీరు అమెరికా అధ్యక్ష స్థానం హుందాతనానికే అప్రతిష్ట తెచ్చేదిగా వుందని ప్రతిపక్షాలు విమర్శించాయి.













