ఫేస్ బుక్ ఐడీకి స్టూడెంట్స్ వివరాలు : నవీన్ జలగం
నకిలీ ధ్రువపత్రాలతో అమెరికాలో చదువు, ఉద్యోగం పేరుతో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై అమెరికా అదుపులోకి తీసుకున్న తెలుగు విద్యార్థుల్లో కొందరికి విముక్తి లభించింది. అక్కడి తెలుగు సంఘాలు అందించిన న్యాయ సహాయం మేరకు 30 మంది విద్యార్థులు బయటపడి హైదరాబాద్కు చేరుకున్నారు. మిగిలిన వారిని కూడా రప్పించేందుకు అక్కడి సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం ఈ విషయాన్ని తెలిపారు. చాలామంది అమాయక విద్యార్థులు అనవసరంగా నకిలీ వీసాల కేసులో ఇరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్థులను కూడా క్షేమంగా ఇండియాకు పంపించే బాధ్యత వహిస్తామని తెలిపారు. ఈ విషయమై ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. కొందరు విద్యార్థులు వివరాలు తెలియక ఇబ్బంది ఎదురవుతోందని, తల్లిదండ్రులు తన ఫేస్బుక్ ఐడీకి స్టూడెంట్స్ వివరాలు పంపాలని కోరారు.













