అమెరికా చిన్నారుల కోసం ‘తెలుగు పలుకు’ పుస్తకావిష్కరణ
అమెరికాలో గత 4 సంవత్సరాలుగా ఎన్నారై తెలుగు చిన్నారులకు మాతృభాష తెలుగును నేర్పిస్తున్న ‘పాఠశాల’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కొత్తగా రూపొందించిన ‘తెలుగు పలుకు’ కోర్స్ను ఈ విద్యా సంవత్సరం నుంచి బోధిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ‘తెలుగు పలుకు’ అచ్చు పుస్తకాన్ని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో టెక్స్ట్బుక్ డిపార్ట్మెంట్ కో ఆర్డినేటర్ టీవిఎస్ రమేష్, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని రూపొందించిన టీచర్లు ఎ. సరళమ్మ, వి. స్వర్ణలత, కె. శేషగిరిరావు, నక్క డేవిడ్రాజు ఇతరులకు ఈ సందర్భంగా తొలి ప్రతులను అందించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, తెలుగుభాషను నేర్చుకుంటున్న ఎన్నారై చిన్నారులకు సులభంగా తెలుగును నేర్చుకునేలా ఈ పుస్తకం ఉంటుందని చెప్పారు. LSRW పద్ధతి ద్వారా తెలుగును త్వరితంగా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 9 నుంచి బే ఏరియాలో పాఠశాల 2017-18 విద్యాసంవత్సరం ప్రారంభమవుతోందని ఆయన చెప్పారు.
పాఠశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.paatasala.net చూడాల్సిందిగా చెన్నూరి వెంకట సుబ్బారావు కోరారు.













