తానా ప్రాంతీయ మహాసభలకు సర్వం సిద్ధం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలో శుక్ర, శనివారాల్లో నిర్వహించే ప్రాంతీయ మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ల్యాండ్డేల్స్లోని నార్త్పెన్ ఉన్నత పాఠశాలలో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా తానా ఎన్నారై తెలుగు మహిళల రక్షణకోసం తానా మహిళా రక్ష పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ వేడుకల్లో గెస్ట్ ఆఫ్ హానర్గా ప్రముఖ గాయని సుశీలను ఆహ్వానించారు. గాయని చిత్ర బృందం ఈ వేడుకల్లో సంగీత విభావరిని నిర్వహిస్తోంది. హేమచంద్ర, శ్రీకృష్ణ, గీతామాధురి, సమీర భరద్వాజ్, పృథ్వీ పాటలను పాడనున్నారు. హీరోయిన్ కమలిని ముఖర్జీ, భానుప్రియ కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు కూడా ఈ మహాసభలకు వస్తున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఇప్పటికే అమెరికా చేరుకున్నసంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్, న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు తానా ప్రకటించింది.













