మదనపల్లె అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సతీష్ వేమన
తానా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సతీస్ వేమన మొదటిసారిగా మదనపల్లె విచ్చేసిన సందర్భంలో ఆయనకు అపూర్వ ఘనస్వాగతం లభించింది. గౌతం నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు రాందాస్ చౌదరి, గుత్తా హరికృష్ణ, తంబాలపల్లి టీడీపీ ఇన్చార్జ్ మల్లికార్జున నాయుడు, మదనపల్లె మునిసిల్ చైర్మన్ శివప్రసాద్, వైస్ చైర్మన్ భవానీప్రసాద్, రాటకొండ సురేంద్ర తదితరులు మేళతాళాలతో పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. సతీష్ వేమనగారితో బాటు తానా బోర్డ్ చైర్మన్ చలపతి కొండ్రకుంట, తానా ప్రాంతీయ ఉపాధ్యక్షులు రఘు మేక, కమిటీ చైర్మన్ రఘు ఎద్దుపలపల్లి తదితర తానా నాయకబృందం ఈ రోజు మదనపల్లె లో జరిగిన అనేక అభివృద్ధి సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మదనపల్లె జిల్లాపరిషత్ హైస్కూల్లో 8,9,10 తరగతుల్లో ప్రతిభ చూపిన తొమ్మిది మంది విద్యార్థులకు స్కాలర్ షిప్లు అందజేశారు. ప్రతి ఏటా వీటిని కొనసాగించనున్నట్లు ప్రకటించారు. హైస్కూల్లో పూర్వవిద్యార్థుల సహకారంతో నిర్మిస్తున్న స్టడీ సెంటర్ నిర్మాణంలో సగం ఖర్చును తానా తరపున విరాళంగా అందజేశారు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, కళాశాలలో మెరుగైన సదుపాయాల కల్పనలో భాగంగా తానా స్టడీ సెంటర్ మరియు ఆర్వో ప్లాంట్ సమకూరుస్తామని వెల్లడించారు.
పట్టణంలోని వశిష్టా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మదనపల్లె ప్రవాసాంధ్రుల సహకారంతో తానా డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామని ప్రకటించారు. తానా సంస్థ చేపట్టిన అభివృద్ధి, సేవాకార్యక్రమాలపట్ల మదనపల్లె వాసులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. సతీష్ వేమనగారికి, తానా సంస్థకు, దాతలకు, కృతజ్ఞతలు తెలియజేశారు.













