తానా – గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చాగల్లు కాకతీయ కల్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేస్ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణుల ఆరోగ్యం పరిరక్షణ కోసం చేస్తున్న సేవలకు తమ సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు. గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు రోజు ఉచితంగా ఆహారం అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఇది అన్ని జిల్లాలకు విస్తరింప చేయడానికి తానా కృషి చేస్తుందని తెలిపారు.
గ్రేస్ ఫౌండేషన్, తానా ట్రస్టీ చైర్మన్ విద్యాసాగర్ గారపాటి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటూ పుట్టిన గ్రామంలో సేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్య ఆరోగ్యాభివృద్ధికి ఫౌండేసన్, తానా సహకారంతో మరిన్ని సేవలు అందచేస్తామని తెలిపారు. శిబిరంలో 512 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారికి అవసరమైన ఖరీదైన పరీక్షలు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఆర్థోపెడిక్, షుగర్, బీపీ, జనరల్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించిన అవసరమైన వారికి మందులు అందజేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఆత్మ చైర్మన్ గండ్రోతు సురేంద్ర కుమార్, గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రమీలరాణి, గారపాటి బ్లెసింగ్ తదితరులు పాల్గొన్నారు.













