తాల్ క్రిస్మస్ వేడుకలు 2022
తాల్ క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ 10, శనివారం రోజున నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్ మరియు పరిసర ప్రాంతాల చర్చిలకి సంబంధించిన వారితో పాటు తెలుగు వారు ఒకచోట చేరి ఈస్ట్ లండన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
వివిధ చర్చిల ప్రతినిధులతో పాటు, పిల్లలు ఏసుక్రీస్తును కీర్తిస్తూ పాటలు ఆలపించారు. సిస్టర్ జెమిమా దారా పర్యవేక్షణలో “యేసు క్రీస్తు జననం” నాటికను బాలలు అత్యంత శ్రద్ధతో ప్రదర్శించారు. యూకే లో పుట్టి పెరుగుతున్న పిల్లలు తెలుగులో ఈ నాటికను ప్రదర్శించడం అందరిని అబ్బురపరిచింది.
సిస్టర్ జెమిమా దారా, సిస్టర్ పద్మ కుందన్ లు వ్యాఖ్యాతలుగా, బ్రదర్ ప్రవీణ్ మానుకొండ గాన బృందానికి వాద్య సహకారాన్ని అందించగా, బ్రదర్ కరుణాకర్ తాల్ క్రిస్మస్ వేడుకలను ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాల్ ట్రస్టీలు గిరిధర్ పొట్లూరు, అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతిలతో పాటు తాల్ సభ్యులు వంశీ మోహన్ సింగలూరి, శ్రీదేవి అల్లెద్దుల, మల్లేష్ కోట పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన రవి మోచెర్ల, రత్నాకర్ దారా లకు కృతజ్ఞతలు తెలిపారు.
పాస్టర్ భరత్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించగా, పాస్టర్ డామినిక్, పాస్టర్ డానియల్ మరియు బ్రదర్ అజయ్ లు బైబిల్ ప్రాధాన్యతను వివరిస్తూ యేసుక్రీస్తుని స్తుతించారు. లండన్ మరియు యూకే లోని తెలుగువారి క్షేమం కోరుతూ ప్రార్ధనలు చేసి, తాల్ తెలుగు వారికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. చివరగా ప్రపంచ మానవాళి సంక్షేమం గురించి ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.













