న్యూయార్క్ లో సుష్మా స్వరాజ్
ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించేందుకు ఆమె వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో వరుసగా చర్చలు జరిపారు. భారత ఉన్నత స్థాయి బృందానికి నేతృత్వం వహిస్తున్న సుష్మా స్వరాజ్ ఇక్కడ ఉండే వారం రోజుల పాటు ఐరాస జనరల్ అసెంబ్లీ సెషన్కు హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన వివిధ దేశాల నేతలతో సుమారు 20 వరకు ద్వైపాక్షిక, త్రైపాక్షిక భేటీలు జరుపుతారని భావిస్తున్నారు. సుష్మా స్వరాజ్కు ఇక్కడ విమానాశ్రయంలో అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ శర్న, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమెరికా, జపాన్ విదేశాంగ మంత్రులు రెక్స్ టిల్లెర్సన్, టారో కోనోలతో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రాంతీయంగా చైనా తన బలాధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మూడు దేశాల మధ్య ఈ త్రైపాక్షిక సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.













