భారతీయ విద్యార్థికి పదేళ్ల జైలుశిక్ష ?
కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడగొట్టానని అంగీకరించిన భారతీయ విద్యార్థికి అమెరికా కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం కనిపిస్తోంది. న్యూయార్క్ రాష్ట్రం రాజధాని అల్బనిలోని సెయింట్ లూయిస్ కళాశాలలో గల కంప్యూటర్లను చెడిపోయేలా చేసినట్లు విశ్వనాథ్ ఆకులతోట(27) అనే భారతీయ విద్యార్థి అంగీకరించాడని అమెరికా అటార్నీ గ్రాంట్ జాక్విత్ తెలిపారు. ఆగస్టులో కోర్టు శిక్ష ఖరారు చేయనుందని చెప్పారు. ఇతడికి పదేళ్ల జైలుశిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న 66 కంప్యూటర్లు, మరికొన్ని కంప్యూటర్ మానిటర్లు, కంప్యూటర్ల పనితీరును పెంచే పోడియంలలో యూఎస్బీ కిల్లర్ అనే ఉపకరణాన్ని ప్రవేశపెట్టాడు. ఫలితంగా 50కి పైగా కంప్యూటర్లు చెడిపోయాయి. ఈ తతంగాన్ని తన ఐఫోన్లో చిత్రీకరించాడు. కళాశాలకు 58,470 డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టపరిహారం చెల్లించడానికి విశ్వనాథ్ అంగీకరించాడు.













