ఎన్నారై విరాళాలకు తొలగిన అడ్డంకులు
ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలుగా ముందుకు వస్తే పాలనాపరంగా ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం అయింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ-స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సంస్ధ మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విదేశీ వ్యవహారాల శాఖకు అనుబంధంగా ఉన్న ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్స్( ఐడిఎఫ్ఓఐ) తరపున ఆ శాఖ సంయుక్త కార్యదర్శి వాణి రావు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పౌండేషన్ తరపున బి.గంగయ్య ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం వల్ల ప్రవాస భారతీయులు ఎఫ్సిఆర్ఏ అనుమతులతో సంబంధం లేకుండా ఐడిఎఫ్ఓఐ వెబ్సైట్ ద్వారా తమ విరాళాలు నేరుగా అందించవచ్చు.
విద్య, వైద్యం, పారిశుధ్యం, మహిళా సాధికారత, సుస్థిర గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో కార్యక్రమాలకు నిధులను విరాళాలుగా ఇవ్వడానికి ఇక స్వేచ్ఛగా ముందుకు రావచ్చు. పాలనాపరమైన రుసుము కానీ, అదనపు చెల్లింపులు కానీ, ఎటువంటి పన్నులు కానీ లేకుండానే దాతలు నిధులు సమకూర్చవచ్చన్నది ఈ ఒప్పందంలో ముఖ్య అంశం. దాతలు ఇచ్చే నిధులు వారు సూచించే ప్రాజెక్టులకే వినియోగిస్తారు. లేనిపక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంయుక్తంగా చర్చించి, ఆ నిధులను వినియోగించే ప్రణాళికలను రూపొందిస్తారు. విదేశాల్లో ఇటువంటి నిధుల సమీకరణకు నిర్వహించే సదస్సుల్లో ఐడిఎఫ్ఓఐ, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సంస్థలు కూడా పాలుపంచుకుంటాయి.













