ఎపిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయనున్న రామ్ రెడ్డి
న్యూజెర్సిలో 25 సంవత్సరాలుగా ఐటీ కంపెనీని విజయవంతంగా నడుపుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు తన కార్యాలయాన్ని విజయవాడలో కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. సీతా కార్ప్ పేరుతో ఆయన నడుపుతున్న ఐటీ కంపెనీ అమెరికాతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇండియాలో కూడా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జన్మభూమిపై మమకారంతో గతంలో హైదరాబాద్లో కంపెనీని ఏర్పాటు చేసిన రామిరెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తన కంపెనీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సి వచ్చినప్పుడు ఆయనను కలిసి కంపెనీ ఏర్పాటు విషయాన్ని తెలియజేశారు. ఎపి ప్రభుత్వం తరపున కంపెనీ ఏర్పాటుకు తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలపడంతోపాటు రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వైజాగ్లో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుతోపాటు హాజరయ్యారు.
పార్టనర్ షిప్ సమ్మిట్ లో కీలక పాత్ర పోషించిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నుంచి రామ్ రెడ్డి కి మంచి సహకారం లభించింది. ఇడిబి తరపున గారపాటి ప్రసాద్, సీఈఓ కృష్ణ కిశోర్ కు సీత కార్ప్ వివరాలు ఇవ్వటం, ఎంఓయుని తయారు చేసుకుని వైజాగ్లో అధికారికంగా అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఈఓ శ్రీ కృష్ణ కిశోర్ జాస్తి, సీత కార్ప్ తరపున రామిరెడ్డి సంతకం చేశారు. తరువాత స్టేజి మీద ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షం లో ఎంఓయు పత్రాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ విజయానంద్, ఐటీ శాఖ అడ్వైజర్ జెఏ చౌదరి కూడా పాల్గొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశాము. సీతాకార్ప్ గురించి వివరించినప్పుడు ఆయన అభినందించారు.













