అమెరికా వ్యాప్తంగా మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షలు !
గత పది సంవత్సరాలుగా 27వేలమందికి పైగా ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పుతున్న సిలికానాంధ్ర మనబడి 2016-17 విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు శనివారం నాడు, అమెరికాలోని 50 కి పైగా ప్రాంతాలలో 1062 జూనియర్ సర్టిఫికేట్ (ప్రకాశం), 372 మంది సీనియర్ సర్టిఫికేట్(ప్రభాసం) విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తిరెడ్డి, పరీక్షా నిర్వహణ సంచాలకులు డా. రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు డా. మునిరత్నం నాయుడు, హెడ్ ఆఫ్ జర్నలిజం డిపార్ట్మెంట్ డా. కడియాల సుధీర్ కుమార్ గార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. ఈ పరిక్షా పత్రాలను అధికారుల సమక్షంలో అమెరికాలోనే మూల్యాంకనం చేసి, ఉత్తీర్ణులైన వారికి మే 21, 2017 న జరిగే మనబడి స్నాతకోత్సవ కార్యక్రమంలో, తెలుగు విశ్వవిద్యాలయం అందించే పట్టాలు ప్రదానం చేయడం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, వాస్క్ అధికారులు డా. జింజర్ హావనిక్, తదితరులు హాజరు కానున్నారు. అమెరికాలోని నాలుగు దిక్కులా జరుగుతున్న ఈ పరీక్షలను శ్రీదేవి గంటి సమన్వయ పరచగా.. కిరణ్ దుడ్డగి గారు సాంకేతిక సహకారం అందించారు.













